ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నా కథలు


నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని  అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు. 

నా మొట్టమొదటి కధ "జీ ఎస్ రావూ సామజిక స్పృహ" . కాని ప్రచురణ కి అంగీకారం మాత్రం "ఓ తమ్ముడి కధ" కి ముందుగా వచ్చింది. ఈ రెండు కథలు రచనలో ప్రచురించారు . రెండు కథలు నేను సాహితి వైద్యం కి పంపిస్తే వసుంధర గారు ఎటువంటి సవరణ లేకుండా ప్రచురణకి పంపించారు . అది నాకు కొంత పొగరు పెంచినదనుకోండి . అయినా అన్ని కథలో నేను వారికే పంపి వారి అక్షింతలతోనే రచన లో నా కథలు చూసుకున్నాను . అంద ప్రభ కి అటువంటి అవకాశాలు లేవు కనుక మాములుగానే పంపాను . 

మొదటి కధ నేను కలం పేరుతో వ్రాయాలని అనుకున్నాను (నాన్న జ్యేష్ట పేరుతో వ్రాసారు కనుక నేను కూడా అలాగే వ్రాయాలనుకున్నాను ), అందుకని మిస్టర్ క్లీన్ అనే కలం పేరుతోపంపించాను . కాని సాయి గారు నేను కధని నాన్నకి అంకితం చేశాను కనుక నేను ఎవరో తెలుసుకున్నారు. ఇటువంటి కలం పేర్లు మంచివి కావని చెప్పారు. ఎందుకంటే మిస్టర్ క్లీన్ అని వ్రాసి తరువాత ఏ వివాదంలో ఇరుక్కున్నా ఆ పేరుకి అపవాదు రావచ్చు. వివాదం లోకి రాకుండా ఉండటం కూడా కష్టమే . ఎందుకంటే ప్రజలలోకి వెళ్ళిన తర్వాత రకరకాల వారు చదువుతారు. రకరకాల వ్యాఖ్యలు చెశ్తారు. అది నా మొదటి పాఠం. 

తర్వాత కొన్ని కథలు రచన లో ఇంకా ఆంధ్రప్రభ లో (అప్పట్లో ఈ రెండు పత్రికలు మాత్రమే కొంచెం విలువలతో నడిచాయి. తర్వాత ఆహ్వానం అని ఒక పత్రిక వచ్చింది . స్వాతి వేరే రకంగా ప్రేరేపించే కథల పత్రిక అనే ముద్ర నుంచి బయటపడి, చాల చక్కగా మారింది. రావి శాస్త్రి గారి "ఇల్లు" ఈ మధ్య రమణ గారి "కోతి కొమ్మచ్చి" వంటి ప్రచురణలతో స్వాతి ఒక మంచి పత్రికగా నిలబడింది.  అప్పటికి నేను కధలు వ్రాయటం మానేసాను. వ్రాసిందే తక్కువ అనుకోండి) వ్రాసాను. 

నాకు బాగా నచ్చిన కధలు "ఓ తమ్ముడి కథ", "అరుణ్ గాడి  కాన్వెంట్ చదువు". ఇది కాకుండా "రావు సాబ్" నాకు వేరే కారణాల వలన ముఖ్యమైనది. ఆ కథ నేను "శివరంజని" పేరుతో వ్రాసాను. ఆ కథ నా గురువు గారు  పీవీ రావు  గారిని దృష్టి లో పెట్టుకునిన్ వ్రాసాను. నా మొట్ట మొదటి ఉద్యోగంలో ఆయనే నాకు స్ఫూర్తి . ఒక శాస్త్రజ్ఞుడు అహోరాత్రులూ శ్రమించి ఒక పరిశోధన లో విజయవంతం అయ్యాక ఏమాత్రం తీరిక లేకుండా మరొక పరిశోధన ప్రారంభిస్తారు. రావు సాబ్ అలాగే ఉండే వారు. నా ముక్కు సూటి వ్యవహారాలతో ఇరుకున పడకుండా ఆయన నాకు ఎంతో సహాయం చెసారు.

నేను ప్రేమలో పాడినప్పుడు "సుబ్బులు సుబ్బారావూ " వ్రాసాను. ఈ కథలో నాన్న కూడా ఉన్నారు. నాన్న లాంటి కళాకారుడు మరొక కళాకారుడిని ఎంత గాడం గా అభిమానిస్తారో వర్ణిస్తూ ఒక చిన్న ప్రేమ కథలా వ్రాసాను . ఐనిస్తైన్ అయినా  అప్పారావు అయినా  ప్రేమలో నిస్సహాయులే . అందుకేనేమో నేను ప్రేమలో పడినప్పుడు గొయ్యిలో పడ్డానని తెలియలేదు. ఇప్పుడు చేయగలిగినది ఏమీ లేదు !!

"అద్వైతం" కథ ఒక నిజమైన సంఘటన నుంచి వచ్చిన కథ. నిజానికి నా కథలన్నీ ఏదో ఒక నిజమైన సంఘటలనుండి   వచ్చినవే .  ఒక దుర్ఘటన జరిగిన తర్వాత నేను వారిని ఓదార్చలేక పోయాను. కారణం అవతల మనిషి నాకు గురుతుల్యుడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అటువంటి మనిషికి నేను ఎలా ఉండాలో చెప్పగలనా? అటువంటి పరిస్థితిలో నేను నా కలం తో నా భావాలు చెప్పుకున్నాను. ఈ కథలో  ఒక దుర్ఘటన వలన  బిడ్డని కోల్పోయిన తండ్రి, తల్లి నిరాశలో జీవిస్తూ అటువంటి సంఘటనే  జరిగిన గంట లోనే కూలికి వెళ్ళిన ఒక కార్మికుడిని చూసి మళ్ళీ మామూలు  ప్రపంచంలోకి రావలసిన అవసరం తెలుసుకుంటారు. నా జీవితానికి దగ్గర కనుక ఈ కథ నా భావోద్వేగాల్ని కదిలిస్తూ ఉంటుంది 

"తిక్క శంకరయ్య", "పాపం నీలాద్రి" వంటి కథలు సరదాగా వ్రాసాను. అందులో "తిక్క శంకరయ్య" నాకు చాలా ఇష్టం . ఈ కథ రచన లో మాత్రమే కాకుండా "మిసిమి" అనే ఒక అంతర్జాతీయ పత్రికలో కూడా ప్రచురితమయ్యింది. 

"ఆడది అబలా?" అని ఒక కథ స్త్రీవాదం మీద కొంచెం విమర్శలా వ్రాసాను . కాని అది నాన్న వ్రాసిన కథే నా శైలి లో వ్రాసినది 
ఓ తమ్ముడి కథ కోడూరి శ్రీ  రామమూర్తి గారు మెచ్చుకున్నారు . చాలా  ఉత్తరాలు వచ్చాయి. వసుంధర గారు ఈ కథకి సాహితి వైద్యం అవసరం లేదని చెప్పి ఎటువంటి సవరణలు లేకుండా ప్రచురణకి పంపారు.

ప్రతీ కథకి నేను పడిన శ్రమ చెప్పలెనిది. ఎన్నో సార్లు తిరగ వ్రాయాలి . నాకు నేను చదువుకుని బాగున్నా తర్వాతే పంపేవాడిని . నేను వ్రాసిన కథ నాకు ముందు నచ్చాలి కదా ? నాకు ఉన్న తిక్కలలో ఒకటి నేను ఎప్పుడూ తిరుగు టపాలో పంపటానికి తపాలా పెట్టనేలేదు . నా పొగరుకి తగినట్లు వ్రాసిన కాసిన్ని కథలలో  ఒక్క కథ కూడా తిరిగిరాలేదు . 

నేను అభిమానించే రచయితలలో మొదటి వారు నాన్నే . నాక్కొంచం నమ్మకివ్వు ఒక మాగ్నమ్ ఓపస్ .  మిగిలిన కథల్లో ఏది నచ్చిందో చెప్పటం కష్టం . ఈ క్షణానికి "దైవం మనుష్య రూపేణం", "ది కేసు అఫ్ ది మిస్సింగ్ బ్రెయిన్ ", "శ్రీ కట్న లీలలు" నచ్చినవి. 

నాన్న తర్వాత ముళ్ళపూడి నా అభిమాన రచయిత . ఆయనని హాస్య రచయిత అంటారు కాని జీవితాన్ని ఎంత చక్కగా జీవించాలో ఆయన చాలామంది జీవితాన్ని కాచి వడ పోసామని చెప్పుకునే రచయితల కన్నా చక్కగా చెప్పారు . రాధా  గోపాలం వంటి దంపతులలా ఉండాలని ఎంతమంది కోరుకోరు? అలాగే మహారాజు యువరాజు వంటి జీవితాలు ఎంతమంది నిజ జీవితంలో చూడలేదు ? ఇంత కన్నా గొప్ప విషయం, ఆయన ఒక్కరిని కూడా విమర్శించరు. ఒక యదార్ధాన్ని మన ముందు చక్కగా చూపిస్తారు . అందరూ కొంత కొంత అవలక్షణాలు ఉన్నవారే కాని అందరూ  మంచివారే అంటారు . 

యండమూరి కూడా నాకు నచ్చిన రచయితే.  చాలా మంది ఆయన గురించి మాట్లాడితే తులసిదళం , ఆనందోబ్రహ్మ వంటి నవలల గురించి చెప్తారు . కాని అయన ఎన్నో అద్భుతమైన కథలు కూడా వ్రాసారు . ఒక ఎలకకి ఒక మధ్య తరగతి మానవుడికి మధ్య నడిచిన కథ చాల బాగుంటుంది . మొగుడిని చిన్న చిన్న మోసాలు చేస్తూ సంతోష పెట్టె ఒక భార్య కథ, మిస్ట్ అనే కథ నాకు నచ్చిన మిగతా కథలు . 

శ్రీరమణ గారు వ్రాసిన కథలలో "ధనలక్ష్మి " , "బంగారు మురుగు" నచ్చిన కథలు. మిథునం గురించి ఎంత చెప్పినా తక్కువే . 

భరాగో గారి సాహిత్య సేవ ఎక్కువగా గుర్తు చేసుకుంటారు గాని ఆయన "ఆశీర్శికం" వంటి అద్భుతమైన కథలు చాలా వ్రాసారు . ఆయన శారద కథలతో పాటు ఎన్నో ఆలోచింపజేసే కథలు వ్రసారు. ఆయన నా కథ "అరుణ్ గాడి చదువు " మెచ్చుకుంటూ వ్రాసిన ఉత్తరం నాకు ఒక పెద్ద అభినందన 

నేను ఒక పరిస్థితిలో రష్యన్ సాహిత్యం కూడా బాగా చదివాను . లవ్రేన్యోవ్  అనే రచయిత అర్జెంటు రవాణా గురించి వ్రాసిన ఒక కథ చాల అద్భుతం . సమాజిక న్యాయం (సోషలిజం) పేరుతో చాలా మంది కథలు వ్రాసారు . అన్ని కథలలోనూ డబ్బున్న వాడు చెడ్డ వాడు, లేని  వాడు చాలా  నిజాయితి పరుడూ మంచివాడూను. ఇటువంటివి చదివి విసిగి పోయిన నాకు ఈ కథ చాల నచ్చింది . గుండెల్ని పిండే ఈ కథ ప్రతివాడు అవసరానికి మించి ఎందుకు సంపాదించ కూడదో ఎందుకు కొంత కూడా త్యాగం చేయలేక పోతున్నారో అనిపిస్తుంది . కథలో అందరూ కొంత కొంత మంచివారే . కాని ఒక పిల్ల వాడి ప్రాణాల  కోసం చిన్న త్యాగం చెయ్యలేకపోతారు . అవసరానికి మించి సంపాదించటం, విలువలు లేని వ్యాపారాలు చెయ్యటం నాన్నకి కూడా చాలా చిరాకు. అది ఈ కథకు సరిగ్గా సరిపోతుంది . 

వేరపనోవ వ్రాసిన సెర్యోష  నవల  చాల అద్భుతమైన పుస్తకం .  పిల్లలని ఎలా పెంచాలో ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది . ఆ పుస్తకం చదివితే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కువ తేడా లేదనిపిస్తుంది . ఒక సంఘటనలో ఒక జైల్లోంచి వచ్చిన  దొంగకి ఇంట్లో అన్నం, పాత  బూట్లు ఇవ్వగలిగే ఔదార్యం చూపిన పెద్దవాళ్ళు సేర్యోష దొంగతనామ్ తప్పు అని చెప్పి  ఎందుకు జాలి చూపించారని అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతారు . ఇలా ఆలోచించకుండా మనం ఎన్నో పనులు చేసేస్తూ ఉంటాం . ఆఖరి సంఘటన మనందరిని భావోద్వేగాలలో ముంచెత్తుతుంది . 

మిహయీల్ షోలేకోవ్ వ్రాసిన "లంజ కొడుకు " కూడా గొప్ప కథ . ఈ కథ కూడా సోషలిజం బాటలో ఉన్నా మాదాల,, సూర్యనారాయణ మూర్తి గార్ల స్థాయిలో కాకుండా సహజంగా ఉన్న కథ . 

కామెంట్‌లు

  1. రాజ మోహన్, ఈ కథల గురించి మీ ఆత్మసమీక్ష చదివాక కథలు చదివేయాలని ఆకలి పెరుగుతోంది. అవి ఇంటర్సెట్ లో దొరికే పక్షంలో దయచేసి తెలియపరచండి.

    మిత్రుడు
    రామారావు

    రిప్లయితొలగించండి
  2. రామారావు గారూ, ఓ తమ్ముడి కథ చదివి మీ అభిప్రాయం చెప్పండి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు